నాది
ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు.
యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు.పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు.
అందుకే దుఃఖం.
ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు.
చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషం.
ఒక్కసారి గా గాలి పీల్చుకున్నాడు.
ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకోసాగాడు!
అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్మెంట్ పోయింది.
ఇప్పుడు నిజం చెప్పాలంటే, మనది కాదు గదా అనుకుంటున్నాడు.
కా... స్త ఆనందిస్తున్నాడు కూడా.
ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు.
అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది.ఏమిచేయాలో పాలు పోక జుట్టు ఒకటి పీక్కోలేదు.
ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు.
అమ్మయ్యా! నిజమేగదా! గూడు కట్టే వేదన గాలికి రాగి పిండి ఎగిరి పోయినట్లు ఎగిరిపోయింది.
'నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది.
Comments
Post a Comment